Friday, September 16, 2016

స్వార్దామృతం

  

  కోట్లకు పడగలెత్తావు. చూడ చక్కని కుటుంబం నీది. కొడుకులు, కోడళ్ళు, మనుమలు, మనుమరాండ్లు, ఆహా! నీ భోగం ఆ దేవేంద్రుని భోగమే అనుకో! కాని ఏమి చేస్తావ్.? నీకున్న స్వార్ధంతో నా అనుకున్న వాళ్లకు తప్ప ఎవ్వరికీ సాయం చేసి ఎరుగవు. ఎంగిలి చేతితో కాకిని తరమవు అన్న కీర్తి సంపాదించావు. ఆఖరికి భగవంతుడినైన నన్ను కూడా కనీసం పలకరించిన పాపాన పోలేదు. లోకం నిన్ను స్వార్ధపరుడని అంటే అంది గాని నీ కోసం నీ భార్యాబిడ్డల కోసం అనుక్షణం పాటు పడిన వాడివిగా నీ కృషి అనన్యసామాన్యం.  అలాటి కోవకు చెందిన వారిలో ఎన్నదగిన వాడవు నువ్వు . అందుకని నీ కోసం రెండు ప్రత్యేక వరాలను ఇవ్వ దలచి ఇలా వచ్చాను అన్నాడు భగవంతుడు ఆ గది లోని ఆ వ్యక్తితో.
      అప్పుడు ఆ వ్యక్తి ఏమిటి స్వామీ ఆ వరాలు అన్నాడు. అప్పుడు భగవంతుడు నాయనా! నువ్వు ఎప్పుడు చనిపోతావో? మొదటి వరంగా నీకు చెబుతా. అంతే కాదు తరువాత జన్మలో నువ్వు ఎక్కడ ఏ తల్లికి పుడతావో రెండవ వరంగా చెబుతా అన్నాడు.
          అలాగా చెప్పు స్వామి అన్నాడు వాడు. దేవుడు ఆ రెండు రహస్యాలను వాడికి చెప్పి నాయనా ఇప్పుడు నువ్వు ఏమి చేస్తావో చూడాలని ఉంది అన్నాడు . చేసేదేముందిలే స్వామీ! ముందు మీరు దయచేయండి అన్నాడు వాడు. దేవుడు మాయమయ్యాడు.
        చచ్చే రోజుకు ముందుగానే వాడు యావదాస్థిని  చిల్లి గవ్వ పోకుండా జాగ్రత్త చేసుకున్నాడు. ఆ రోజు రానే వచ్చింది. దూరమైన వాళ్లు దూరంగానే ఉన్నారు. పెళ్ళాం బిడ్డలు మాత్రం ఐనోళ్ళ మైన మాకు పూచిక పుల్ల కూడా ఇవ్వకుండా యావదాస్థినీ ఎవరో ఊరూ  పేరూ  లేని దాని పేరిట రాసి చచ్చాడీ వెధవడు అంటూ వాపోతున్నారు.
    అప్పుడు దేవుడికి గురుతొచ్చింది. ఈ పిల్ల కడుపునేగా తరువాతి జన్మలో వీడు పుడతాడని చెప్పాను. అందుకని వీడి స్వార్ధం వీడికి ఐన వాళ్ళ మీద కూడా పనిచేసిందన్న మాట.
అమ్మో ! నేను అవకాశమివ్వక గాని ఎవ్వడూ కూడా పోగేసి తన వాళ్లకు కూడా ఇవ్వడన్న మాట! అని అనుకున్నాడు

No comments:

Post a Comment